This page has not been fully proofread.

22
 
దేవీ అశ్వధాటి
 
హృదయ
 
దేవి మహాత్ములైన మునుల హృదయాలలో ఉంటుంది. ఆమెను హృదయంలోనే
దర్శించి హృదయాయైనమః అని ధ్యానిస్తే హృదయం శోభావహ మైతుంది. ఆమె పట్ల ప్రీతి
పెరుగుతుంది. ఆత్మ చైతన్యం కలుగుతుంది. ఆమె భావనామాత్ర సంతోష హృదయ. కనుక
ఆమెను భావిస్తేనే చాలు హృదయం ఆనందం పొందుతుంది.
 
పరమాత్మ ఉనికినీ స్వరూపాన్నీ దర్శన విధానాన్నీ దర్శనంవల్ల కలిగే ప్రయోజనాన్నీ
అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కఠోపనిషత్తు వివరించింది.
 
పంకారి
 
పంకం = పాపం. సంబంధంవల్ల విస్తృతమయ్యేది. దేవి మహాపాతక నాశిని. ఆమె
సంసారవంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంకంలో మునిగిపోయిన జనాన్ని
ఉద్ధరించటంలో సమర్ధురాలు. ఈ విషయాన్నే కూర్మపురాణంలో కూడ గమనించవచ్చు.
యే మనా గపి శర్వాణీం, స్మరన్తి శరణార్ధనః ।
దుస్తరాపార సంసార సాగరే న పతన్తి తే ॥
 
శంకా శిలా నిశిత
 
ఆమె సంశయఘ్ని. దేహేంద్రియ సుఖాలు మిథ్యలని భక్తులకు బోధించి స్వాత్మ
సాక్షాత్కారం కలిగిస్తుంది. ఆపై ఇహపర ప్రతిబంధకాలను తొలగిస్తుంది. భక్తులకు మోక్ష
ప్రతిబంధకాలైన సంశయాలనే రాళ్లను పగుల గొట్టడంలో దృఢమైన ఉలులవంటివి ఆమె
పాదాలు. కనుక ఆ పాదాలను ఆశ్రయించి సదా ధ్యానిస్తే తాపత్రయం శమిస్తుంది. పరమాత్మ
సాక్షాత్కారం కలుగుతుంది.
 
- ముండకోపనిషత్
 
భిద్యతే హృదయగ్రంథి, శ్చిద్యంతే సర్వ సంశయాః ।
క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టి పరావరే ॥
పరమాత్మ సాక్షాత్కారం కలిగితే, అప్పటి వరకూ హృదయంలో ఉన్న అజ్ఞాన వాసన వీడిపోతుంది.
సర్వ సందేహాలూ ఛేదింపబడతాయి. బ్రహ్మజ్ఞాని అవుతాడు. శుభాశుభకర్మలు క్షీణిస్తాయి.
నిష్కల్మషు డైతాడు. పూర్ణజ్ఞాని అవుతాడు. శాంత చిత్తు డైతాడు. అందువల్ల ప్రతిఒక్కరికీ
భగవతీ పదధ్యానం పరమావశ్యకం. అందుచేతనే దేవతలనే అళిబృందాలు ఆ దేవీ పదపద్మాల
చెంత చేరి ఝంకారం చేస్తూ సేవనామృతాన్ని ఆస్వాదిస్తుంటాయి. తత్ఫలితంగా వారు స్వాత్మ
సాక్షాత్కారం పొందుతారు.
 
శశి సంకాశ ..... వక్త్ర కమలాం
 
గిరిజాదేవీ ముఖ కమలం మచ్చ లేని చంద్రబింబం లాంటిది. కమలం రక్తవర్ణ మేళనం
కలది. అది వికసించి శోభావహంగా ఉంటుంది. అలా ఆమె ముఖం షోడశ కళలతో నిండిన
పూర్ణ చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. ఆమె రాకేందు ముఖి, చంద్రకళానిభ, ప్రసన్న వదన,
నిష్కళంక.